పళనిస్వామి మళ్లీ సీఎం అవుతారు: తంబిదురై సంచలన వ్యాఖ్యలు

  • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్న తంబిదురై
  • సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో, అన్నాడీఎంకే సీనియర్ నేత ఎం. తంబిదురై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి మళ్ళీ అధికారంలోకి వస్తారని, సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేతులు కలుపుతున్నాయనే వార్తల నేపథ్యంలో తంబిదురై వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.



ఈపీఎస్‌తో భేటీ అయిన అనంతరం తంబిదురై మీడియాతో మాట్లాడుతూ.. పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజలకు మళ్ళీ 'సుపరిపాలన' అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పార్టీలో అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయని, ఫలితాలు సానుకూలంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అయితే, రాబోయే రోజుల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) తో అన్నాడీఎంకే బంధం కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్నపై తంబిదురై స్పష్టతనివ్వడానికి నిరాకరించారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో అన్నాడీఎంకే అన్ని రాజకీయ ద్వారాలను తెరిచి ఉంచిందని, అవసరమైన బలాన్ని కూడగట్టుకునే దిశగా అడుగులు వేస్తోందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.


మ్యాజిక్ ఫిగర్ 118 ని చేరుకోవడానికి ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో, తమిళనాడులో ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చలు, బేరసారాలు జరుగుతున్నాయి. ఒకవైపు టీవీకే అధినేత విజయ్ అతిపెద్ద పార్టీగా నిలిచి మెజారిటీ కోసం ప్రయత్నిస్తుంటే, మరోవైపు అన్నాడీఎంకే కూడా రేసులో ఉన్నామని ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.


Edappadi Palaniswami
Tamil Nadu Politics
AIADMK
M Thambidurai
Tamil Nadu Assembly Elections
DMK
NDA Alliance
Government Formation
Tamil Nadu Government
EPS

More Telugu News